John 12
కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు వున్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడ భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు.
"అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములుతుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను."
ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా
ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.
"వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను."
కాబట్టి - యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురు గాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
"కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమేగాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి."
అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి.
గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంపనాలోచన చేసిరి.
"మరువాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని,"
"ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి - ''యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదింపబడును గాక'' అని కీర్తనలు118:26 లో చెప్పబడినట్లుగా జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అనుచు కేకలు వేసిరి."
"''సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి; నీ రాజునీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీవద్దకు వచ్చుచున్నాడు'' అని జెకర్యా9:9లో వ్రాయబడిన ప్రకారము"
"యేసు, ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను."
"ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి."
"ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి."
అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి.
కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు - మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి.
పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.
"వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి - అయ్యా, మేము యేసునుచూడగోరుచున్నామని అతనితో చెప్పగా,"
"ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి."
అందుకు యేసు వారితో ఇట్లనెను - ''మనుష్యుకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది;
గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును.
"ఇప్పుడు నా ప్రాణము కలవరపుచున్నది; నేమందును? - తండ్రీ, ఈ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;"
"తండ్రీ, నీ నామము మహిమపరచుము'' అని చెప్పెను. అంతట ''నేను దానిని మహిమపరచితిని, మరల మహిమపరతును'' అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను."
కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము - ఉరిమెను అనిరి. మరికొందరు - దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.
"అందుకు యేసు - ''ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను."
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
నేను భూమిమీద నుండి పైకెత్తబడినయెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును'' అని చెప్పెను.
తాను ఏ విధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
జనసమూహము - క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? - మనుష్యకుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
"అందుకు యేసు - ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు."
మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడి'' అని వారితో చెప్పెను.
యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
"''ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలు పరచబడెను?'' అని ప్రవక్త యెషయా53:1లో చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను."
"ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా"
"''వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుము'' అని యెషయా మరియొక చోట6:10లో చెప్పెను."
యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను.
"ఆయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు."
వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను - నా యందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.
నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకు కలడు; నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞయిచ్చియున్నాడు.
మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.