Revelation 7
"అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని."
మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో
ఈ దూత- మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
"యూదా గ్రోత్రములో ముద్రింపబడిన వారు పన్నెండు వేలమంది,"
"రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పన్నెండు వేలమంది, ఆషేరు గోత్రములో పన్నెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పన్నెండు వేల మంది, మనష్షే గోత్రములో పన్నెండు వేలమంది,"
"షిమ్యోను గోత్రములో పన్నెండు వేలమంది, లేవీ గోత్రములో పన్నెండువేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పన్నెండువేలమంది,"
"జెబూలూను గోత్రములో పన్నెండు వేలమంది, యోసేపు గోత్రములో పన్నెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పన్నెండు వేలమంది ముద్రింపబడిరి."
"ఆటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, ఎవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను నిలువబడి-"
సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దల చుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడియుండిరి.
వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి- ఆమేన్; యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను.
"అందుకు నేను అయ్యా- నీకే తెలియుననగా, అతడు ఈలాగు నాతో చెప్పెను- వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి."
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును.
"వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,"
"ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును."