Acts 2
పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఒక చోట కూర్చుండి యుండిరి.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.
"మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ,"
"అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి."
ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.
ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.
"అంతట అందరు విభ్రాంతి నొంది, ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?"
"మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే, ఇదేమి?"
"పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ, ప్రుగడియ, పంపులియ, ఐగుప్తు అను దేశములందలి వారు,"
"కురేనియ దగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదా మతప్రవిష్టులు,"
"క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి."
అందరు విభ్రాంతినొంది ఎటు తోచక యిదేమగునో అని ఒకనితో నొకడు చెప్పుకొనిరి.
కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
"అయితే పేతురు ఆ పదునొకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను - యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి."
"మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామయినా కాలేదు."
"యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా-"
"అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు."
ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
"పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమిమీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసెదను."
"ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకముందు, సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు."
అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరును రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
"ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పుపొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే యెరుగుదురు."
"దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువవేయించి చంపితిరి."
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. |
ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
"కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడ నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును."
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు.
నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు.
"సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాటలాడవచ్చు అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటివరకు మన మధ్యనున్నది."
"అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతెరిగి,"
"క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు, దావీదు ముందుగా తెలిసికొని, ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను."
ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము.
"కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు."
దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతిట్లనెను.
"నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా నుంచువరకు, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను."
మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
"వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని - సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా,"
పేతురు - మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరకును అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికి చెందునని వారితో చెప్పెను.
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను.
"కాబట్టి అతని వాక్యమునంగీకరించిన వారు, బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి."
"వీరు అపొస్తలులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి."
అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్యార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.
"విశ్వసించిన వారందరు ఏకముగా కూడి, తమకు కలిగిదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి."
ఇదియును గాక వారు తమ చర స్థిరాస్థులను అమ్మి అందరికి వారి వారి అక్కరలకొలది పంచిపెట్టిరి.
"మరియు వారేక మనస్కులై, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందినవారై,"
"ఆనందముతోను, నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చు కొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండిరి."