:

Acts 8

1

ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.

2

భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.

3

పౌలయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.

4

కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.

5

అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.

6

"జనసమూహములు విని, ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా"

7

అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్దకేకలు వేసి వారిని వదలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.

8

అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.

9

"సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో యొక గొప్ప వాడినని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను."

10

కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు - దేవుని మహాశక్తి అనబడిన వాడితే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి.

11

అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారతని లక్ష్యపెట్టిరి.

12

అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.

13

"అప్పుడు సీమోను కూడ నమ్మి, బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను."

14

"సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును, యెహానును వారి యొద్దకు పంపిరి."

15

"వీరు వచ్చి, వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి."

16

"అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి."

17

అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.

18

అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెనని సీమోను చూచి-

19

వారి యెదుట ద్రవ్యము పెట్టి - నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.

20

అందుకు పేతురు - నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడ నశించును గాక.

21

నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.

22

కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును.

23

నీవు ఘోర దుష్టత్వములోను చేదైన పైత్యములోను దుర్నీతి బంధకములలోను యున్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను.

24

అందుకు సీమోను - మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.

25

అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.

26

"ప్రభువు దూత - నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా, అతడు లేచి వెళ్ళెను."

27

"అప్పుడు ఐతియోపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై, ఆమె యొక్క ధనాగారమంతటిమీద నున్న ఐతియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను."

28

అతడు తిరిగి వెళ్ళుచు తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.

29

అప్పుడు అత్మ ఫిలిప్పుతో - నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను.

30

"ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి, అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా,"

31

"అతడు - ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి, తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను."

32

అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా - ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా నుండునో ఆలాగే ఆయన నోరు తెరువకుండెను.

33

ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక పోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతును? ఆయన జీవము భూమిమీద నుండి తీసివేయబడినది.

34

అప్పుడు నపుంసకుడు - ప్రవక్త ఎవరిని గూర్చి ఈలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా? వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.

35

అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనముననుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను.

36

వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు - ఇదిగో నీళ్ళు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి? అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.

37

ఫిలిప్పు - నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను. అతడు - యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను.

38

ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళ లోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను.

39

వారు నీళ్ళలోనుండి వెలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడును చూడలేదు.

40

అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.

Link: