John 18
"యేసు ఈ మాటలు చెప్పిన తన శిష్యులతో కూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడ వెళ్లెను."
"యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను."
"కావున యూదా - సైనికులను, ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను, దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను."
యేసు తనకు సంభవింప బోవునవన్నియు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్లి - ''మీరెవని వెదకుచున్నారు'' అని వారినిఅడిగెను.
"వారు - నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు - ''ఆయనను నేనే'' అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచుండెను."
"ఆయన - ''నేనే ఆయనను'' అని వారితో చెప్పగా, వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి."
"మరల ఆయన - ''మీరు ఎవనిని వెదకుచున్నారు'' అని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా,"
యేసు వారితో - ''నేనే ఆయనను'' అని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని పోనియ్యడని చెప్పెను.
నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పొగొట్టు కొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
"సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దాని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను."
"ఆ దాసునిపేరు మల్కు. యేసు - కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? అని పేతురుతో అనెను."
"అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి."
అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.
కయప - ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.
పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
"ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో - నీవును ఈ మనుష్యుని శిష్యులతో ఒకవు కావా? అని చెప్పగా, అతడు - కాననెను."
అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను.
"ప్రధానయాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా,"
యేసు - ''నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్న వారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు'' అని అతనితో అనెను.
ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు - ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తర మిచ్చుచున్నావా? అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
అందుకు యేసు - ''నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావు'' అనెను.
"అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను."
"సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి - నీవును ఆయన శిష్యులలో ఒకవు కావా? అని చెప్పగా, అతడు - నేను కాను, నేనెరుగననెను."
"పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును - నీవు తోటలో అతనితో కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు,"
పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్లలేదు.
కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి - ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
అందుకు వారు - వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.
"పిలాతు - మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా,"
యూదులు - ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందుబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
"పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి - యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా,"
యేసు - నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా? అని అడిగెను.
"అందుకు పిలాతు - నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులును నిన్ను నాకు అప్పగించిరి గదా?; నీవేమి చేసితివని అడుగగా,"
యేసు - ''నా రాజ్యము ఇహసంబంధమైనదికాదు. నా రాజ్యము ఈ లోక సబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు'' అనెను.
"అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా, యేసు - ''నీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని? సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినును'' అనెను."
అందుకు పిలాతు - సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి - అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు.
అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీ కిష్టమా? అని వారి నడిగెను.
"అయితే వారు - వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ."