Acts 11
అన్యజనులును దేవుని వాక్యమునంగీకరించిరని అపొస్తలులును యూదయ నందంతటనున్న సహోదరులును వినిరి.
పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతిపొందినవారు -
నీవు సున్నతి పొందని వారియొద్దకు పోయి వారితో కూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
అందుకు పేతురు - మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను.-
"నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా - నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటియొక పాత్ర ఆకాశమునుండి దిగి నా యొద్దకు వచ్చెను."
"దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా, భూమియందుండు చతుష్పాద జంతువులును, అడవి మృగములును ప్రాకెడి పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను."
"అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని."
"అందుకు నేను - వద్దు ప్రభువా; నిషిద్ధమైనవి అపవిత్రమైనవి ఏదియు నానోట ఎన్నడును పలేదని చెప్పగా,"
రెండవ మారు ఆ శబ్దము ఆకాశమునుండి - దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.
ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొనిపోబడెను.
వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి.
అప్పుడు ఆత్మ - నీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి. మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి.
అప్పుడతడు - నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము.
"నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను."
"నేను మాటలాడ నారంభించినప్పుడు, పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను."
అప్పుడు - యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని.
"కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించియుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పెను."
వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక - అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి.
"స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరిపోయినవారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి."
"కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో నుండిరి. వీరు అంతియొకయకు వచ్చి, గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి."
ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి.
వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి.
అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహు జనులు ప్రభువు పక్షమున జేరిరి.
అంతట అతడు పౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.
వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో నుండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.
వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరవు రాబోవు చున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.
అలాగున చేసి బర్నబా పౌలు అనువారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.